Pages

Monday 29 December 2014

VAIKUNTHA EKADASHI / MUKKOTI EKADASHI

ముక్కోటి ఏకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి
పంచాంగం ప్రకారం ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. "ఏకాదశి" పాడ్యమి నుండి వచ్చే పదకొండవ రోజు ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. 
సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి లేక వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.
 వైష్ణవ ఆలయాల్లో భక్తులు తెల్లవారుజామున నుండి దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుదై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఒక్క రోజు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకునందువల్ల దిన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడు హాలాహలం, అమృతం పుట్టాయి. 
ఈ రోజున శివుడు హాలాహలం మింగాడు,
మరియు మహా భారత యుద్ధ సమయంలో భగవద్గీతను శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు అని విశ్వాసం. గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. 
అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలలో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.  తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మ పురాణం ప్రకారం శ్రీ మహా విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. 
ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. 
 వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. 
ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది.  వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అర్థం. దశమి నాడు రాత్రి జాగారం చేసి ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు బ్రాహ్మణుడికి అవపోసన వేస్కోని భోజనం చేయాలి.

No comments:

Post a Comment